తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలివి: BBC Special Report

  • రిపోర్టింగ్: బళ్ల సతీశ్, షూట్ అండ్ ఎడిట్: నవీన్ కుమార్
  • బీబీసీ ప్రతినిధులు

ఫొటో సోర్స్, KIPL Barrage 2

గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ... రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్తగా సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం చేపట్టిన భూసేక‌ర‌ణ క్లిష్టంగా మారింది. అక్క‌డి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు.

నిర్మాణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టుకు ఊహించని స్థాయిలో పేరొచ్చింది. దీంతో ఇది పర్యటక ప్రాంతంగానూ మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు.

ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలేంటి? ఇతర సాగు నీటి ప్రాజెక్టులకు మించి దీనికున్న ప్రత్యేకతలు ఏమిటి?

వీడియో క్యాప్షన్, వీడియో: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎలా నిర్మిస్తున్నారో చూడండి

గోదావరి వైపు చూపు.. పాత ప్రాజెక్టుకు కొత్త రూపు

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వం రీడిజైన్ చేయించింది.

ముందుగా అనుకున్న‌ట్టు ప్రాణ‌హిత న‌దిపై కాకుండా కాస్త కింద‌కు, ప్రాణ‌హిత న‌ది గోదావ‌రిలో క‌లిసిన త‌రువాత‌ ప్ర‌ధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు.

ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది.

తెలంగాణ- మ‌హారాష్ట్ర స‌రిహద్దుల్లోని గోదావ‌రి నుంచి ద‌క్షిణాన హైద‌రాబాద్, చిట్యాల‌, షామీర్‌పేట వ‌ర‌కు నీళ్లొచ్చేలా ఈ కొత్త‌ డిజైన్ ఉంది.

ఫొటో క్యాప్షన్, కన్నెపల్లిలో నిర్మిస్తున్న ఓపెన్ పంప్ హౌజ్

తాగునీటికి.. పారిశ్రామిక అవసరాలకు కూడా..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.

కొత్త ఆయ‌కట్టు కాకుండా శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయ‌ర్ మానేరు, అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టుల‌ను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించ‌డానికి కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు త‌వ్వారు.

వీటి ద్వారా మిగిలిన నీటిని త‌ర‌లించి ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తారు. అంటే ఆ రిజ‌ర్వాయ‌ర్ల కింద ఉన్న 18.82 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నిక‌రంగా నీరందించ‌వ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది.

వీటికి అద‌నంగా, పాత ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్ర‌తిపాదించిన చోటే అప్ప‌టికంటే ఎత్తు త‌గ్గించి మ‌రో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 ల‌క్ష‌ల ఎక‌రాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.

ఫొటో క్యాప్షన్, మేడారం ట్యాంక్‌

గోదావరి నీటిని గోదావరిలోనే కలిపేలా..

న‌దిలో నీటి ప్ర‌వాహాన్ని ఆపడానికి క‌ట్టే నిర్మాణాన్ని బ్యారేజ్ అంటారు. న‌దిలోనే జ‌లాశ‌యం కూడా నిర్మిస్తే డ్యామ్ అంటారు. (ఉదాః నాగార్జున సాగ‌ర్ డామ్, ప్ర‌కాశం బ్యారేజ్).

ఇప్పుడు గోదావ‌రిపై మూడు చోట్ల (మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం) బ్యారేజ్‌లు క‌డుతున్నారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మ‌రో బ్యారేజ్ ముందుకు వ‌దిలేలా ఏర్పాటు ఉంటుంది. (గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో, ఎగువ‌కి) ఇలా మేడిగ‌డ్డ నుంచి ఎల్లంప‌ల్లి వ‌ర‌కూ నీటిని తెస్తారు. అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా నీటిని పంపిస్తారు.

అలా నీరు సొరంగాలు, కాలువ‌ల్లో ప్ర‌వ‌హించి, పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోప‌ల‌, బ‌య‌ట ప్ర‌యాణించి వేర్వేరు కొత్త, పాత జ‌లాశ‌యాలను క‌లుపుతూ ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కూ వ‌స్తుంది.

ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే అవ‌స‌రానికి అనుగుణంగా గోదావ‌రి నీటిని కాలువ‌లోకి మ‌ళ్లించి, గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో (వెన‌క్కు) తీసుకెళ్లి మ‌ళ్లీ గోదావ‌రిలోనే క‌లుపుతారు. ఇదంతా కాళేశ్వ‌రం లింక్ -1 లో జ‌రుగుతుంది.

అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా అనుకున్న చోటుకు త‌ర‌లిస్తారు. ఇందుకోసం వివిధ చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజ‌ర్వాయ‌ర్ల‌ను, కాలువ‌ల‌ను బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు, రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించారు.

ఈ మొత్తం ప‌నిని లింకులుగా, తిరిగి ఆ లింకుల‌ను ప్యాకేజీలుగా విభ‌జించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి.

ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. లింక్ 1, లింక్ 2 ల‌లో మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు, ధ‌ర్మారం, రామ‌డుగు గ్రామాల ద‌గ్గ‌ర్లో భూగ‌ర్భంలో నిర్మిస్తోన్న పంపుహౌజులు ఉంటాయి.

ఫొటో క్యాప్షన్, జలాశయాల్లోని నీటిని తోడే మోటార్లకు ఉపయోగించి స్టాట‌ర్‌లోని ఒక భాగం ఇది.

'అవసరమైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి అందిస్తాం'

తాత్కాలిక రాజ‌కీయ ల‌బ్ధి కోసం కాకుండా దీర్ఘ కాలిక ప్ర‌యోజ‌నం కోసమే భారీ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి టి.హ‌రీశ్ రావు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ "తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు.

అందుకే ఇంజినీర్లు, మేధావులు, నీటిపారుదల శాఖతో సీఎం కేసీఆర్ తీవ్రంగా చ‌ర్చించి కాళేశ్వ‌రం డిజైన్ రూపొందించారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు తెచ్చి తెలంగాణ‌ను స‌శ్య‌శ్యామ‌లం చేయాల‌న్న ఆలోచ‌న‌తో ప‌నిచేస్తున్నాం'' అని తెలిపారు.

భ‌విష్య‌త్తులో అవ‌స‌రమనుకుంటే మరో టీఎంసీ నీటిని తోడ‌టానికి వీలుగా కావ‌ల్సిన సివిల్ వ‌ర్క్స్ ఇప్పుడే చేసి పెట్టామని, అవ‌స‌రమైతే కృష్ణా పరివాహ‌క ప్రాంతానికి కూడా నీరు పంప‌డానికి ఆటోమేటిగ్గా మూడో పంపు బిగించేయ‌వ‌చ్చని హ‌రీశ్ రావు చెప్పారు.

ఫొటో సోర్స్, KIPL Barrage 2

ప్ర‌త్యేక‌త‌లు

  • మొత్తం 20 జిల్లాల‌కు సాగు, తాగు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.
  • పాత ప్రాజెక్టుపై 2008 నుంచి 2014 వ‌ర‌కు రూ.7 వేల కోట్లు ఖ‌ర్చు అయింది.
  • కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని లిఫ్టుల నిర్వ‌హ‌ణ‌కు 4,600 మెగావాట్ల క‌రెంటు కావాలి.
  • కొత్త బ్యారేజీల వ‌ల్ల గోదావ‌రిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరుంటుంది.
  • సాగునీటి ప్రాజెక్టుల‌ను నేరుగా నీటిపారుద‌ల శాఖ చేప‌డుతుంది. కానీ, కాళేశ్వ‌రం మాత్రం కార్పొరేష‌న్ కింద‌ చేస్తున్నారు.
  • ఇందుకోసం కాళేశ్వ‌రం ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ‌ను ఏర్పాటు చేసారు.
  • ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 లు అత్యంత వేగంగా జ‌ర‌గుతున్నాయి. వచ్చే వేస‌వి పంట‌కు వాటి ద్వారా నీరివ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది.
  • దేశంలోని మిగిలిన సాగునీటి ప్రాజెక్టుల‌తో పోలిస్తే ఎక్కువ ఖ‌ర్చుతో ఒక రాష్ట్రం సొంతంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టు ఇది.
ఫొటో క్యాప్షన్, రామడుగులో నిర్మిస్తున్న పంప్‌హౌజ్ విహంగ వీక్షణం

ఇంజినీరింగ్ ప్రాధాన్య‌త ఏంటి?

కాళేశ్వ‌రం ప్రాజెక్టుల్లో అతి ముఖ్య మైన‌ అంశాలుగా ట‌న్నెల్స్(సొరంగం), స‌ర్జ్ పూల్, భారీ పంపులు, గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్ స్టేష‌న్‌లను చెప్పుకోవాలి.

తెలంగాణలో గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం ద‌క్క‌న్ పీఠ‌భూమి మీద ఉండటంతో న‌ది నుంచి నీటిని కాలువ‌ల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువ‌లో పోయాల్సిందే. దీన్ని లిఫ్ట్ ఇరిగేష‌న్(ఎత్తిపోత‌లు) అంటారు.

న‌ది నుంచి నీరు కాలువ‌లోకి రావ‌డం, అక్క‌డి నుంచి సొరంగం ద్వారా ప్ర‌యాణించడం. అక్క‌డ భూమిలోప‌ల ఉన్న పంపుల‌ నుంచి తిరిగి పైకి రావడం. అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం. ఇదీ ఇక్క‌డ జ‌రిగే ప్ర‌క్రియ‌. ఇందుకోసం ఈ 4 ప్ర‌త్యేక నిర్మాణాలు అవ‌స‌ర‌మ‌య్యాయి.

ఫొటో క్యాప్షన్, ట‌న్నెల్స్

ట‌న్నెల్స్: భూసేక‌ర‌ణ త‌గ్గించ‌డానికి, భూమి ఎత్తుప‌ల్లాల స‌మ‌స్య‌ల‌ను త‌ప్పించుకోవ‌డానికి భూగ‌ర్భంలో కాలువ‌లు నిర్మించారు. భూమి కింద ప‌ది మీట‌ర్ల వ్యాసంతో ఈ ట‌న్నెల్స్ నిర్మించారు. అంటే ఒక్కో ట‌న్నెల్లో ఒకేసారి నాలుగు కార్లు ప్ర‌యాణించవ‌చ్చ‌న్న‌మాట‌.

ఇలా మొత్తం 203 కిలోమీట‌ర్లు పొడ‌వైన ట‌న్నెల్స్ నిర్మిస్తున్నారు. ప్ర‌పంచంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. కానీ, నీటిని త‌ర‌లించ‌డానికి ఇంత పెద్ద, పొడ‌వాటి సొరంగాలు ఎక్క‌డాలేవ‌ని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఫొటో క్యాప్షన్, స‌ర్జ్ పూల్

స‌ర్జ్ పూల్: ట‌న్నెల్స్ నుంచి వ‌చ్చిన నీటిని నేరుగా పంపులు తోడ‌వు. నీటి హెచ్చుత‌గ్గుల వ‌ల్ల పంపుల్లో స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డం కోసం ఆ నీటిని చిన్న జ‌లాశ‌యం లాంటి దాంట్లో నిల్వ చేయాలి. ఎత్తిపోతల ప‌థ‌కాల్లో ఇది అనివార్యం. ఆ జ‌లాశ‌యం లాంటి నిర్మాణం భూమిపైన ఉంటే 'ఫోర్ బే' అనీ, భూమిలోప‌ల ఉంటే 'స‌ర్జ్ పూల్' అనీ అంటారు.

భూమిలోప‌ల ఉండే చిన్న‌సైజు రిజ‌ర్వాయ‌రే స‌ర్జ్ పూల్ అన్నమాట‌. ఈ ప్రాజెక్టులో 2 స‌ర్జ్ పూల్స్ నిర్మిస్తున్నారు. వీటి నుంచి పంపుల్లోకి నీరు వెళుతుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే కొండ కింద, భూమి లోప‌ల నేల‌ను, రాళ్ల‌ను తొలిచి చెరువులు క‌డుతున్నార‌న్న‌మాట‌.

ఫొటో క్యాప్షన్, పంపులు

పంపులు: నీరు తోడుకునే పంపులు అంద‌రికీ తెలిసిన‌వే. పంపుకు మోటార్ బిగిస్తే నీరు వ‌స్తుంది. మ‌న ఇంట్లో, పొలాల్లో ఉండే పంపుల్లాంటివే ఇవి. కానీ, ఇక్క‌డ వాడే పంపులు ఒక్కోటీ చిన్న‌ భ‌వ‌నం అంత ఉంటాయి. ఇక్క‌డ వాడే మోటార్‌లోని స్టార్టర్ భాగాన్ని మూడు ముక్క‌లు చేస్తే ఒక ముక్క‌ను ఒక పెద్ద లారీలో ప‌ట్టుకెళ్లాలి.

కాళేశ్వ‌రంలో వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు.

ఈ ట‌న్నెల్, స‌ర్జ్ పూల్, పంపులే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

ఫొటో క్యాప్షన్, ధ‌ర్మారం ద‌గ్గ‌ర్లోని భూఅంతర్భాగంలో నిర్మిస్తున్న గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్ స్టేష‌న్

గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్ స్టేష‌న్

మండ‌ల కేంద్రాల్లో క‌రెంటు స‌ర‌ఫ‌రా చేసే స‌బ్ స్టేష‌న్లు చూస్తుంటాం. అవి సాధార‌ణ సామ‌ర్థ్యంతో ఉంటాయి. అలా కాకుండా 400/11 కేవీ క‌రెంటు స‌బ్ స్టేష‌న్లు ఎక్కువ సామ‌ర్థ్యంతో ఉంటాయి.

ఇవి నిర్మించ‌డానికి 60 ఎక‌రాల స్థ‌లం కావాలి. అయితే ధ‌ర్మారం ద‌గ్గ‌ర్లో నిర్మిస్తోన్న పంపుహౌజు స‌రిగ్గా ఒక కొండ కింద ఉంది. ఆ పంపుహౌజుకు క‌రెంటు ఇవ్వ‌డానికి స‌బ్ స్టేష‌న్ కావాలి.

కొండ పైన స‌బ్ స్టేష‌న్ నిర్మించ‌డం క‌ష్టం. స్థ‌లం కొర‌త‌. దీంతో భూమి లోప‌లే సబ్ స్టేష‌న్ నిర్మించాల్సి వ‌చ్చింది. భూమిలోప‌ల 60 ఎక‌రాలు తొల‌చడం, స‌బ్ స్టేష‌న్ నిర్మించ‌డం అసాధ్యం.

దీనికోసం గ్యాస్ ఇన్సులేటెడ్ సాంకేతికతను వాడుతున్నారు. అంటే స‌బ్ స్టేష‌న్ల‌లోని ట్రాన్స్ఫార్మ‌ర్ల మ‌ధ్య ఖాళీ స్థ‌లం పెద్ద‌గా అవ‌స‌రం లేకుండా ద్ర‌వ రూపంలోని గ్యాసుల‌ను వాడ‌తారు.

ఎస్.ఎఫ్.6 (స‌ల్ఫ‌ర్ హెక్సాఫ్లోరైడ్) ను ఇన్సులేట‌ర్‌గా వాడి భూమిపైన 60 ఎక‌రాల్లో నిర్మించాల్సిన స‌బ్ స్టేష‌న్ భూమి లోప‌ల రెండెక‌రాల కంటే త‌క్కువ స్థ‌లంలో నిర్మిస్తున్నారు. దీనివ‌ల్ల ఖ‌ర్చు రెండున్న‌ర రెట్లు పెరుగుతోంది. ఓ జ‌ర్మ‌న్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది.

'గ్రానైట్ రాయితో పని సులువైంది'

లిఫ్టుల‌కు సంబంధించి ప్ర‌పంచంలో ఇదే పెద్ద ప్రాజెక్ట్‌ అని కాళేశ్వ‌రం ప్రాజెక్టు లింక్ 1 & 2 చీఫ్ ఇంజినీర్ వేంక‌టేశ్వ‌ర్లు బీబీసీకి చెప్పారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''పంపు లోతు వంద మీట‌ర్ల కంటే ఎక్కువ ఉంటే అండ‌ర్ గ్రౌండ్ ఎక్కువ అనుకూలం. ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంది. అందుకని వీలైన‌న్ని అండ‌ర్ గ్రౌండ్ పంపులు, టన్నెల్స్ పెట్టాం. తెలంగాణ‌లో మంచి గ్రానైట్ రాయి అందుబాటులో ఉండ‌డం సాంకేతికంగా అనుకూల‌మయ్యింది. సాధార‌ణంగా ఇటువంటి ప్రాజెక్టు రెండేళ్ల‌లో పూర్తి చేయ‌డం అరుదు." అని తెలిపారు.

భారీగా నిధుల కేటాయింపు

కాళేశ్వ‌రం ప్రాజెక్టు రీడిజైన్ త‌రువాత అంచ‌నా వ్య‌యం రూ.80,500 కోట్ల‌కు పెరిగింది. ప్రాజెక్టును తొంద‌ర‌గా పూర్తి చేయ‌డం కోసం బ్యాంకు లోను తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు.

నాబార్డు, ప్ర‌పంచ బ్యాంకు వంటి సంస్థ‌లు కాకుండా, క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు సాగునీటి ప్రాజెక్టుకు లోన్లు ఇవ్వ‌డం విశేషం.

ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తొంద‌ర‌గా పూర్తి చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు గ్యారెంటీగా ఉండి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది.

లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ క‌న్సార్టియం రూ.7,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.4,685 కోట్లు విడుద‌ల‌య్యాయి. లింక్ 2 కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు క‌న్సార్టియం రూ.11,400 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. దాంట్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3,473 కోట్లు వ‌చ్చాయి.

"గోదావ‌రి మీద ఏ బ్యారేజీ కూడా ఐదు నుంచి ఐదున్న‌రేళ్ల లోపు పూర్తి చేయ‌లేదు. కానీ, మేం దీన్ని రెండేళ్ల‌లో పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్రాజెక్టు తొంద‌ర‌గా పూర్తి అయితే, ఫ‌లితాలు తొంద‌ర‌గా అందుతాయి. ఆల‌స్యం అయ్యే కొద్దీ ఖ‌ర్చు పెరుగుతుంది. ధ‌ర‌ల పెరుగుద‌ల రేటు 15 నుంచి 16 శాతం ఉంటే, బ్యాంకు వ‌డ్డీ 8 నుంచి 10 శాతం ఉంటుంది. అందుకే, రాష్ట్ర ప్ర‌భుత్వ గ్యారెంటీతో బ్యాంకు నుంచి నిధులు స‌మ‌కూర్చాం. దీని వ‌ల్ల.. పంటలకు తొంద‌ర‌గా నీరిచ్చి రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆప‌వ‌చ్చు. ప్ర‌భుత్వంపై భారం కూడా త‌గ్గించ‌వ‌చ్చు. జీఎస్‌డీపీ కూడా పెరుగుతుంది."అని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

నిర్వాసితుల అభ్యంతరాలు

ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ కంటే సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణ చాలా క్లిష్టంగా మారింది. అక్క‌డి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు. వారు తాజాగా మ‌రోకేసు వేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం కేంద్రం చ‌ట్టం ప్ర‌కారం కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో ద్వారా ఇస్తోంది. దీనిపై ప‌లువురు నిర్వాసితులు అభ్యంత‌రాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాల వ‌ర‌కూ సేక‌రించాల్సి ఉంది.

టూరిజం శాఖ 'కాళేశ్వరం ప్యాకేజీ'

తెలంగాణ టూరిజం కార్పొరేష‌న్ ఇటీవల ఒక కొత్త టూరిస్ట్ స‌ర్వీస్ ప్రారంభించింది. ఈ ట్రిప్పులో భాగంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యటకులకు చూపిస్తారు. ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చూపెట్టడానికి టూరిజం కార్పొరేష‌న్ బ‌స్సు న‌డ‌ప‌డం విశేషమే.

అంతేకాదు, వివిధ రంగాల‌కు చెందిన వారిని, రాజ‌కీయ, ప్ర‌భుత్వ వ‌ర్గాల వారిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు చూసేలా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. అక్క‌డ‌కు వ‌చ్చిన వారికి ఇంజినీర్లు ద‌గ్గ‌ర ఉండి ప్రాజెక్టు నిర్మాణాల గురించి వివ‌రిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్, తెలంగాణ పర్యాటక శాఖ కాళేశ్వరం ప్రాజక్టు కోసం ప్రత్యేకంగా పర్యటక ప్యాకేజీని ఏర్పాటు చేసింది

అంకెల్లో ప్రాజెక్టు వివరాలు

  • నీటి సరఫరా మొత్తం మార్గం: 1832 కి.మీ
  • మామూలు కాలువల‌ పొడవు: 1531 కి.మీ
  • సొరంగాలు (భూగ‌ర్భ కాలువ‌లు) పొడ‌వు: 203 కి.మీ
  • పైపులైన్ పొడ‌వు: 98 కి.మీ
  • మొత్తం లిఫ్టులు: 20
  • పంపు హౌజ్‌లు: 19
  • అవసరమయ్యే విద్యుత్తు: 4627.24 మెగావాట్లు
  • మొత్తం విద్యుత్ సబ్ స్టేషన్లు: 17
  • అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం: 139 మెగావాట్ల‌వి 7 పంపులు (రామ‌డుగు వ‌ద్ద‌)
  • పాత జలాశయాలు: 5 (ఇప్ప‌టికే నిర్మించినవి లేదా స‌హ‌జ‌మైన‌వి)
  • కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
  • మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీలు
  • 13 జిల్లాల్లో వ‌చ్చే కొత్త ఆయ‌క‌ట్టు: 18,25,700 ఎక‌రాలు
  • శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగ‌ర్, సింగూరుల పాత ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ: 18,82,970
  • (18.82 లక్షల ఎకరాల్లో మొత్తంగా 25% నీటి కొరతను పరిగణించి)
  • కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ఆయకట్టు స్థిరీకరణ:34.5 టిఎంసిలు
  • హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా: 30 టీఎంసీలు
  • దారిపొడవునా ఉండే గ్రామాలకు తాగునీరు: 10 టీఎంసీలు
  • పారిశ్రామిక అవసరాలకు: 16 టీఎంసీలు
  • ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం: 225 టీఎంసీలు
  • ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణం: 70,326 ఎకరాలు
  • ఇప్పటిదాకా సేకరించిన భూమి: 36,624 ఎకరాలు
  • సేకరించవలసిన భూమి: 33,702 ఎకరాలు
  • మొత్తం అంచ‌నా ఖ‌ర్చు: 80 వేల 500 కోట్లు
  • బ్యాంకులు ఇస్తోన్న లోన్లు: 18 వేల 800 కోట్లు

(ఆధారం: తెలంగాణ ప్రభుత్వం భారీ నీటిపారుద‌ల శాఖ ప్ర‌కారం)

(ఈ వార్తను 2018 జులైన 7న ప్రచురించాం. ఎక్కువ మందికి అందించాలన్న ఉద్దేశంతో మళ్లీ పబ్లిష్ చేస్తున్నాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)